12-18 ఏళ్ల వారికి కొవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానున్న శుభవార్తను కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ అరోరా తెలిపారు. జైడస్ క్యాడిలా టీకా ట్రయల్స్ దాదాపు పూర్తి అయ్యాయని ఆగస్టు కల్లా 12-18 ఏళ్ల వారికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశా భావం వ్యక్తం చేశారు. దేశమంతా వ్యాక్సినేషన్కు 6-8 నెలల సమయం పట్టనుండగా, థర్డ్వేవ్ ఆలస్యంగానైనా రావొచ్చని ఐసీఎంఆర్ అంటోందన్నారు. రోజుకు కోటి టీకాలు వేయాలనేదే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు 18 సంవత్సరాలలోపు వయసున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయోగాలు, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
ప్రస్తుతం పలు దేశాల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తుండగా, మన దేశంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక కీలకమైన మైలురాయి అవుతుందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలను పూర్తి స్థాయిలో తెరిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థుల చదువుకు మార్గం సుగమమవడానికి తోడ్పడుతుందని అన్నారు.