ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వ్యక్తిగతంగా హాజరు కావాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా టీటీడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం ప్రదర్శించారు. కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యంపై ప్రశ్నించారు. ఈ నెల 27న జరిగే తదుపరి విచారణకు ఈవో కచ్చితంగా హాజరుకావాలని, లేనిపక్షంలో రూ. 20 వేల జరిమానా విధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని టీటీడీ తరఫు న్యాయవాది కోరడంతో, కోర్టు ఈ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు 2023లో ఆరోపణలు వచ్చాయి. అయితే, అప్పటి ప్రభుత్వ హయాంలో టీటీడీ అధికారులు ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరపకుండా లోకాయుక్త ద్వారా రాజీ కుదిర్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టీటీడీ పరకామణి చోరీ కేసు : టీటీడీ ఈవో వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ
October 17, 2025
0
Tags