చైనాలో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత ప్లేయర్లు అబు హుబైదా-ప్రేమ్ కుమార్ కాంస్య పతకం సాధించారు. డబ్ల్యూహెచ్1-డబ్ల్యూహెచ్2 కేటగిరీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన భారత జోడీ సెమీఫైనల్లో చైనా ద్వయం చేతిలో ఓడింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో అబు హుబైదా-ప్రేమ్కుమార్ ఆలె జంట 4-21, 10-21తో మాయి జియాన్పెంగ్-క్యూ జిమో జోడీ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్ 'ఎ'లో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఒక పరాజయంతో భారత షట్లర్లు సెమీఫైనల్కు అర్హత సాధించారు. 'ప్రతి మ్యాచ్లో కొత్త సవాలే. వాటిని దాటితేనే ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఎంత కష్టమో మాకు తెలుసు. ఈ కాంస్యం భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించగలమనే నమ్మకాన్ని పెంచింది' అని అబు హుబైదా పేర్కొన్నాడు. ఇటీవల థాయ్లాండ్ వేదికగా జరిగిన ఆఇసయా పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోనూ ఈ జంట పతకం నెగ్గింది. చిన్నప్పుడు పోలియో మహమ్మారి బారినపడి కాళ్లు కోల్పోయిన 31 ఏళ్ల హుబైదా... వైకల్యాన్ని అధిగమిస్తూ నాలుగుసార్లు జాతీయ చాంపియన్గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో సైతం అతడు నిలకడగా పతకాలు సాధించాడు.
పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో హుబైదా-ప్రేమ్ జంటకు కాంస్యం
September 21, 2025
0
Tags