అస్సాంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దరంగ్ జిల్లాలోని మంగళ్డోయ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి కాదు, పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులకు, జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అస్సాంను పాలించిందని, కానీ బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించిందని విమర్శించారు. అదే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 10 ఏళ్లలో అలాంటి ఆరు నిర్మాణాలను నిర్మించిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ పాత పార్టీ చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తోందని అన్నారు. చొరబాటుదారులు భారత్ భూమిని ఆక్రమించుకోవడానికి, జనాభాను మార్చడానికి చేసే కుట్రలను బీజేపీ అనుమతించదని ప్రధాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో, పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిన దేశ సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి బదులుగా, చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షించడంలో నిమగ్నమై ఉందని ప్రధాని విమర్శించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్ల ‘ఆపరేషన్ సింధూరం’ విజయవంతమైందని, ఈ పవిత్ర భూమిపై ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో జవహర్లాల్ నెహ్రూ అస్సాం ప్రజలపై చేసిన గాయాలు ఇంకా మానలేదని ప్రధాని పేర్కొన్నారు. ఆక్రమిత భూమి నుంచి చొరబాటుదారులను తరిమికొట్టి, రైతులు ఇప్పుడు ఈ భూములలో సాగు చేసుకునేలా చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను ప్రధాని ప్రశంసించారు. భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించినందుకు బాధపడినట్లు ప్రధాని పేర్కొన్నారు. వారి కలలను సాకారం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం ఎదుగుతోందని, అస్సాం వృద్ధి రేటు 13 శాతంగా ఉందని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అస్సాంను ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాయి అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మంగళ్డోయ్లో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణాన్ని, నర్సింగ్ కాలేజీ, జీఎన్ఎం స్కూల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం 1,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 2.9 కి.మీ. పొడవైన నరేంగి-కురువా వంతెనకు, అస్సాంలోని కామరూప్, దరంగ్ జిల్లాలను, మేఘాలయలోని రి భోయ్ను కలిపే 118.5 కి.మీ. పొడవైన గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తుంది !
September 14, 2025
0
Tags