97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణశాఖ ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందం విలువ రూ.62వేల కోట్లు. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయ్యింది. మిగ్-21 యుద్ధవిమానాల స్థానంలో ఈ సింగిల్ ఇంజిన్ ఎంకే-1ఏ తేజస్ జెట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమానాల్లో.. 68 యుద్ధవిమానాలు, 29 ట్విన్ సీటర్స్ ఉండనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లలో ఉత్తమ్ AESA రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థలతోపాటు కంట్రోల్ యాక్యుయేటర్లు ఉంటాయి. వీటిలో 64శాతానికి పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణశాఖ పేర్కొంది. 2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతోపాటు ఆత్మనిర్భర భారత్, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొందిస్తుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు వచ్చే ఆరేళ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపాయి. అయితే, హెచ్ఏఎల్తో ఇది రెండో ఒప్పందం కాగా.. రూ.48వేల కోట్లతో 83 తేజస్ యుద్ధవిమానాల సమీకరణకు రక్షణ శాఖ 2021 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ ఒప్పందం !
September 25, 2025
0
Tags