ర్యాపిడో ఓన్లీ అనే కొత్త సర్వీస్ను బెంగళూరులో పరీక్షాత్మకంగా ప్రారంభించింది. ఇది బెంగళూరులోని బైరసంద్ర, తవరేకెరే, మడివాల, హుసూర్ సర్జాపుర రోడ్, కొరమంగల వంటి కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ను ర్యాపిడో పూర్తి యాజమాన్యంలోని సబ్సిడియరీ Ctrlx Technologies ద్వారా నిర్వహిస్తోందని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ శంకా తెలిపారు. ఓన్లీ ప్రధాన లక్ష్యం స్విగ్గీ, జొమాటో ధరల కంటే సుమారు 15% తక్కువ ధరల్లో ఆహారం అందించడం. ఇది సాధ్యమవ్వడానికి కారణం ర్యాపిడో రెస్టారెంట్లపై 30% వరకు కమిషన్ వసూలు చేయకుండా, ప్రతి ఆర్డర్కు స్థిరమైన ఫీజు మోడల్ను ఉపయోగించడం. ఈ ప్రణాళికను ర్యాపిడో గత జూన్ నెలలోనే రెస్టారెంట్లకు పరిచయం చేసింది. ఇంకా ఫ్యూయల్ ఖర్చులు తగ్గించడానికి అలాగే వేగవంతమైన సర్వీస్ కోసం డెలివరీ జోన్లను చిన్న పరిధిలోనే ఉంచాలని కంపెనీ భావిస్తోంది. దీని వల్ల కేవలం సమీపంలోని రెస్టారెంట్లను మాత్రమే యూజర్లకు చూపిస్తారు. అంతేకాకుండా, రెస్టారెంట్లకు తగిన లాభం వచ్చేలా చేస్తూ.. మరోవైపు కస్టమర్లకు మంచి ఎంపికలు దొరకేలా మెనూలను సమకూర్చే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ కొత్త సర్వీస్ కోసం ర్యాపిడో తన విస్తారమైన వాహన నెట్వర్క్ను వినియోగించుకోనుంది. దేశవ్యాప్తంగా ర్యాపిడో కింద సుమారు కోటి వాహనాలు ఉన్నాయి. వాటిలో 50 లక్షలకు పైగా రెండు చక్రాల వాహనాలు ఉన్నాయి. ఇదే నెట్వర్క్ ఇప్పటికే టాక్సీ, కొరియర్ సేవలకు ఉపయోగపడుతోంది. అంతేకాకుండా రాపిడో గతంలో స్విగ్గీ కోసం డెలివరీలు నిర్వహించడం వల్ల పీక్ టైమ్లు, ప్రాచుర్యం పొందిన రెస్టారెంట్లపై విలువైన డేటాను సేకరించింది. ఈ డేటాను ఉపయోగించుకునే హక్కు ర్యాపిడోకు ఉన్నప్పటికీ, స్విగ్గీతో చేసిన ఒప్పందం ప్రకారం జొమాటో లేదా ఇతర పోటీదారులతో పనిచేయరాదు.
'ఓన్లీ' ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించిన ర్యాపిడో !
August 14, 2025
0
Tags