పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై దాడి : జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం

Telugu Lo Computer
0

శ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్ష నేత, భాజపా కీలక నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూచ్‌ బెహర్‌లో ఆయన కాన్వాయ్‌పై టీఎంసీ గూండాలు దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో పోస్టు పెట్టారు. ఈ దాడి పోలీసుల సమక్షంలోనే జరగడం ఇంకా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ ఘటన మమతా బెనర్జీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు. ఇది కేవలం ఒక ప్రజాప్రతినిధిపై జరిగిన దాడి కాదు, ప్రజాస్వామ్యంపైనే జరిగిన దాడిగా అభివర్ణించారు. తాను సువేందు అధికారికతో మాట్లాడి ఆయన పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. బెంగాల్‌లో ఒక ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజల దుస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక, రాజకీయ హింసాత్మక ఘటనలకు మమతా బెనర్జీ జవాబుదారీగా ఉండాలన్నారు. మరోవైపు, ఇటీవల భాజపా ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా మంగళవారం సువేందు అధికారి జిల్లా ఎస్పీకి మెమోరాండం ఇచ్చేందుకు వెళ్తుండగా అనుమానిత తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆయన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో మంత్రి ఉదయాన్‌ గుహాతో పాటు మొత్తం 41 మంది వ్యక్తులపై భాజపా ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు పోలీసులు కూచ్‌ బెహర్‌లో పలుచోట్ల ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)