ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా వంగర మండలంలో తహసీల్దారు వివిధ పనులపై వెళ్లిన ప్రజలను రోజుల తరబడి తిప్పిస్తున్నారు. తహసీల్దారు హరిరమణారావు గురువారం మధ్యాహ్నం మద్యం తాగి నేలపై నిద్రపోయారు. సిబ్బందికి చెప్పి, గది బయట తాళాలు వేయించారు. పనుల నిమిత్తం వెళ్లినవారు తహసీల్దారు ఎక్కడని అడిగితే క్షేత్ర పర్యటనకు వెళ్లారని సమాధానం చెప్పారు. కిటికీలో నుంచి చూడగా ఆయన పడుకుని ఉండటం గుర్తించి మీడియాకు సమాచారం ఇచ్చారు. వెంటనే తాళాలు తీయగా మద్యం మత్తులో ఆయన లేవలేని స్థితిలో ఊగుతూ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించి పడిపోయారు. మీడియా అక్కడకు చేరుకుని తహసీల్దారును ప్రశ్నించగా, విధినిర్వహణలో అలసిపోయినట్లు సమాధానం ఇచ్చారు. ఇంతలో వీఆర్ఏ ఉదయ్కుమార్ చేరుకుని ద్విచక్రవాహనంపై ఆయన్ను తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆర్డీవో ఆశయ్య వద్ద ప్రస్తావించగా.. చాలారోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని, మద్యం తాగి విధులకు రావడం నేరమన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
మద్యం తాగి కార్యాలయంలో నిద్రపోయిన తహసీల్దారు
August 08, 2025
0
Tags