ఘరానా మోసగాడి అరెస్టు !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నానని, ఎంపీ కుమారుడినని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ ఎస్సై శ్రీలతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చిన్ననట్టుకి చెందిన వాయిల వెంకటేశ్వర్లు (29) విశాఖపట్నం రిషికొండలో నివసిస్తుంటాడు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చి కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ఉమెన్స్‌ పీజీ హాస్టల్‌కు వెళ్లాడు. హాస్టల్‌ నిర్వాహకురాలికి తాను ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కుమారుడినని, పేరు విక్రాంత్‌ రెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. తన బంధువులు, జూనియర్‌ డాక్టర్లను హాస్టల్‌లో చేర్పించే నెపంతో తన అనుచరులతో వచ్చి హడావుడి చేశాడు. అతన్ని హాస్టల్‌ నిర్వాహకురాలు బాగా నమ్మింది. ఈ క్రమంలో తమకు జూబ్లీహిల్స్‌లో జ్యువెలరీ షాపు ఉందని, ఆమె 4 తులాల బంగారు గొలుసును రీమోడలింగ్‌ చేయిస్తానని తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.55 వేలు, మరోసారి రూ.45 వేలు తీసుకున్నాడు. తర్వాత కనిపించలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశ్వర్లును కేపీహెచ్‌బీలో అరెస్టు చేసి, అతని నుంచి రెండు బెంజ్‌ కార్లు స్వాధీనం చేసుకున్నారు. అతను గతంలోనూ అద్దెకు తీసుకున్న బెంజ్‌ కార్లలో తిరుగుతూ ఇలాంటి మోసాలకు పాల్పడ్డాడని, అతనిపై ఏపీలో 12 కేసులు, హైదరాబాద్‌లో రెండు కేసులు ఉండగా ఓ సారి జైలుశిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. . 

Post a Comment

0Comments

Post a Comment (0)