యూ పిక్స్ క్రియేషన్ సంస్థ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

Telugu Lo Computer
0


హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించి, భారీ మోసం చేసిన యూ పిక్స్ క్రియేషన్ సంస్థ వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రకటించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు నిడుమోలు కిరణ్ కూడా ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 344 మంది సభ్యులు కలిపి మొత్తం రూ.592 కోట్లు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. 183 మంది రూ.353 కోట్లు ఇన్వెస్ట్ చేసి, కేవలం రూ.159 కోట్లు మాత్రమే తిరిగి పొందడంతో భారీగా నష్టపోయారు. 136 మంది రూ.238 కోట్లు పెట్టుబడి పెట్టి, రూ.358 కోట్లు వెనక్కి తీసుకుని లాభపడ్డారు. 25 మంది రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టి, లాభ నష్టాలు లేకుండా అదే మొత్తాన్ని తిరిగి తీసుకున్నారు. ఏజెంట్లు కమిషన్ రూపంలో రూ.6.51 కోట్లు పొందినట్టు గుర్తించారు. కీలక నిందితుడు కిరణ్ ఒక్కడే సుమారు రూ.23 కోట్లు సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం వ్యవహారంలో పెట్టుబడిదారులు ఎదుర్కొన్న నష్టం రూ.201 కోట్లుగా నిర్ధారించారని కమిషనర్ వివరించారు. ఈ కేసులో మిగతా నిందితులపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని, ఇలాంటి మోసపూరిత పెట్టుబడి పథకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)