ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆగస్టు 13 నాటికి వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 12 నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆగస్టు 9 నుంచి 11 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 12న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 13న గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆగస్టు 14న ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)