జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్లో మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) విలయంలో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 500 మందికి పైగా గల్లంతైనట్లు అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ''కిశ్త్వాడ్లో చోటుచేసుకున్న క్లౌడ్ బరస్ట్లో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నా. కొందరు అధికారులు ఈ సంఖ్య వెయ్యి దాటొచ్చని చెబుతున్నారు. ఇది తీవ్ర విషాదకరమైన క్షణం'' అన్నారు. గతేడాది అక్టోబర్లో జమ్మూకశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒమర్ అబ్దుల్లా ప్రసంగించారు. ఈ విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంతో విలువైన ప్రాణాలను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. జమ్మూకశ్మీర్ కొండల్లో మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) బీభత్సం సృష్టించింది. మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై విరుచుకుపడింది. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి తనతో మాట్లాడారని, ఘటనా స్థలంలో పరిస్థితులు, కొనసాగుతోన్న సహాయక చర్యల గురించి ఆయనకు వివరించానని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ క్లౌడ్ బరస్ట్తో నష్టపోయిన వారికి సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు, ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం, స్థానిక వాలంటీర్లు సైతం ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
క్లౌడ్ బరస్ట్లో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నా !
August 15, 2025
0
Tags