ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు ఆమోదంతో డ్రీమ్11 వ్యాపారాన్ని మూసివేయడానికి సన్నాహాలు

Telugu Lo Computer
0


న్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025 పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో రియల్ మనీ గేమ్‌లకు సంబంధించిన కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ముఖ్యంగా రియల్ మనీ గేమ్‌ల వ్యాపారంతో ముడిపడి ఉన్న కంపెనీలలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డ్రీమ్ 11 వంటి పెద్ద కంపెనీలు తమ వ్యాపారాన్ని మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన వెంటనే.. డ్రీమ్11 తన రియల్-మనీ గేమింగ్ యూనిట్ ను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త గేమింగ్ బిల్లు నగదు ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లపై చట్టపరంగా నిషేధం విధించనుంది. దీంతో డ్రీమ్11 ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్టర్ అయిన 28 కోట్ల మందికి పైగా వినియోగదారులకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.  2008లో హర్ష్ జైన్, భావిత్ షేత్ ద్వారా ఫాంటసీ గేమింగ్ కంపెనీ అయిన డ్రీమ్11 స్థాపించబడింది. 28 కోట్లకు పైగా యూజర్లతో ఇది భారత్‌లోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారంగా మారింది.  2024 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సంస్థ దాదాపు రూ.9,600 కోట్ల ఆదాయానని నమోదు చేసింది. నివేదికల ప్రకారం ఈ ఆదాయంలో 90శాతం డ్రీమ్11 రియల్-మనీ కాంటెస్ట్‌ల ద్వారానే వచ్చింది. ఇందులో క్రికెట్ గేమ్‌ల వాటా ఎక్కువగా ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్11 సీఈవో హర్ష్ జైన్ ఒక అంతర్గత నోట్‌లో ఉద్యోగులకు ఈ విషయం తెలియజేశారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత డబ్బుతో ఆడే గేమ్‌లను కొనసాగించడానికి ఎలాంటి మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ తన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ మార్పు గురించి స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. డ్రీమ్11 బిజినెస్ చాలా వేగంగా విస్తరించింది. 2021 నాటికి దాని విలువ 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టైగర్ గ్లోబల్, క్రిస్‌క్యాపిటల్, మల్టిపుల్స్, టీసీవీ వంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. అయితే రియల్ మనీ గేమింగ్ యూనిట్ మూసివేతపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి డ్రీమ్11 యాప్ పనిచేస్తోందని కంపెనీ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025' వల్ల ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ ఆందోళనలో ఉంది. ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు కంపెనీలను భయపెడుతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025 ప్రకారం, రియల్ మనీ పేమెంట్ ఆధారిత ఫాంటసీ స్పోర్ట్స్ గేమ్‌లు, పోకర్, రమ్మీ వంటి వాటిపై పూర్తి నిషేధం విధించబడింది.ఈ బిల్లులో కేవలం ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమింగ్‌కు మాత్రమే అనుమతి ఉంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా ఒక కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)