నిమిష ప్రియకు మరణశిక్ష రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

Telugu Lo Computer
0


యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవేమనని, నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్‌ అధికారులు నిర్ణయించారంటూ సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. భారత గ్రాండ్‌ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్‌ హబీబ్‌ ఒమర్‌ బిన్‌ హఫీజ్‌ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్‌ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో ఉరిశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిష ప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి. దీంతో నిమిష ప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.


Post a Comment

0Comments

Post a Comment (0)