దుబాయ్ సంస్థ లులూ గ్రూప్ విజయవాడలో భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. గతంలో విశాఖలో మాల్ ఏర్పాటు కోసం లులూ గ్రూప్ కు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీగా భూమి కేటాయించగా, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు విశాఖతో పాటు విజయవాడలోనూ లులూ మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో లులూ గ్రూప్ కు త్వరలో విజయవాడలో భూమి కేటాయింపు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మల్లాది విష్ణు లులూ మాల్ ఏర్పాటు కోసం విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్ల విలువైన స్ధలం కేటాయింపు ప్రతిపాదనను తప్పుబట్టారు. ఒకవైపు కక్షసాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములను తన బినామీలకు కారుచౌకగా అప్పగించి, తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విజయవాడ గవర్నర్ పేట లోని ఆర్టీసీ పాత బస్టాండ్తో పాటు, విద్యాధరపురంలోని ఆర్టీసి డిపో స్థలాన్ని కూడా లూలూ సంస్థకు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం ఉందన్నారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం విజయవాడ పాత బస్టాండ్ స్థలం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని మల్లాది తెలిపారు. అలాగే విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో స్థలం విలువ కూడా చాలా ఎక్కువే అన్నారు. ఒక కార్పొరేట్ సంస్థకు అంత విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం మరో అతి పెద్ద అవినీతి పర్వానికి తెర లేపిందన్నారు. అసలు ఒక కార్పొరేట్ సూపర్ మార్కెట్ సంస్థకు ప్రభుత్వం విలువైన స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో చాలా చోట్ల వాల్మార్ట్ మార్కెట్లు ఏర్పాటు చేసిందని, వారంతట వారు స్థలం సేకరించుకుని, తమ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు తప్ప, ఎక్కడా ప్రభుత్వం వారికి విలువైన స్థలాలు ఇవ్వలేదన్నారు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఆ పని చేస్తోందన్నారు. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుకు సంస్థకు ధారాదత్తం చేశారని, హార్బర్ పార్కులో ఎకరం భూమి మార్కెట్లో రూ.150 కోట్లకు పైనే పలుకుతుండగా, ఏకంగా 13.43 ఎకరాల భూమిని నామమాత్ర లీజ్కు ఇచ్చేశారని, దాని విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు అన్నారు. ఇంకా పన్ను ప్రయోజనాలు కల్పించారన్నారు. అయితే విమర్శలతో సంస్ధ వెనక్కి తగ్గిందని, విజయవాడలో ఆర్టీసీ స్ధలం ఇస్తే సహించేదిలేదన్నారు.
లులూ గ్రూప్ కు విజయవాడ పాత బస్టాండ్ స్థలం : వైసీపీ నేత మల్లాది విష్ణు
July 19, 2025
0
Tags