నేషనల్ హెరాల్డ్ కేసు : జూలై 29న దీనిపై తీర్పు వెలువరించనున్న కోర్టు

Telugu Lo Computer
0


నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, తదితరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జూలై 29న దీనిపై తీర్పు వెలువరించనుంది. మనీ లాండరింగ్‌కు ఇదొక 'క్లాసికల్ ఎగ్జాంపుల్' అంటూ ఈడీ ఇంతకుముందు పేర్కొంది. కాంగ్రెస్ అగ్రనేతలు రూ.2,000 కోట్ల మేరకు నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ వివాదానికి కీలకంగా ఉంది. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సంయుక్తంగా 76 శాతం వాటా ఉంది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ ఆస్తులను అక్రమంగా యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాడుకుందని ఈడీ ప్రధాన ఆరోపణగా ఉంది. ఈడీ ఫిర్యాదులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ దివంగత నేతలు మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తోపాటు శ్యామ్ పిట్రోడా, సుమన్ డూబే, యంగ్ ఇండియా కంపెనీ తదితరుల పేర్లు ఉన్నాయి. రూ.90 కోట్ల రుణం పేరుతో రూ.2,000 కోట్ల విలువచేసే ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియాకు మళ్లించుకున్నారని ఈడీ చెబుతోంది. ఈడీ ఛార్జిషీటులో సునీల్ భండారి, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేటు లిమిటెడ్ పేర్లు కూడా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)