టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి రూ.12,760 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.12040 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయంలో 1.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30 శాతం పెరిగి 24.5 శాతానికి చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితుల కారణంగా డిమాండ్ తగ్గిందని కంపెనీ సీఈఓ కె కృతి వాసన్ పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. దీనికి జులై 16వ తేదీని రికార్డు డేట్గా నిర్ణయించింది. ఆగస్టు 4న చెల్లింపులు చేయనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో నియామకాలు 6071కు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 613,069కు చేరింది. కంపెనీ నుంచి వలసల రేటు 13.8 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో గురువారం కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.3,382.30 వద్ద ఫ్లాట్గా ముగిశాయి.
ఒక్కోషేరుకు రూ.11 డివిడెండ్ ప్రకటించిన టీసీఎల్
July 10, 2025
0
Tags