తిరుమలకు వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమలు సాధ్యాసాధ్యాల పైన అభిప్రాయ సేకరణ మొదలైంది. అమలు నిర్ణయం వేళ అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. దర్శనం టికెట్, టైమ్ స్లాట్ లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఎలా అమలు చేయాలనే ఆలోచన పైన స్పష్టత రావటం లేదు. టీటీడీ పాలకమండలి సమావేశంలోనే ఈ అంశం పైన చర్చ జరిగింది. తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం బారిన పడినా, గాయపడినా ఇప్పటి వరకూ వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో లేక ప్రమాదాల్లో మరణిస్తే ఎక్స్గ్రేషియా తరహాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు, మరణాలు కూడా సంభవిస్ తున్నాయి. నడక దారిలో వన్యప్రాణుల మూలంగా భక్తులకు ప్రమాదం ఉంది. జనవరిలో జరిగిన తొక్కిసలాట ఘటన టీటీడీని కుదిపివేసింది. ఆ ఘటనలో మర ణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి టీటీడీ ఆర్థిక సాయం చేసింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైంది. తిరుమలకు నిత్యం 70 వేల మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు. వీరందరికీ బీమా సదుపాయం కల్పించడం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. భక్తుడి తరఫునా బీమా కంపెనీలకు టీటీడీనే ఏడాది పొడవునా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థికంగా టీటీడీపై ఇది పెనుభారం కానుంది. అలాగే తిరుమలకు మూడు మార్గాల్లో యాత్రికులు తిరుమల వెళ్తున్నారు. వీరందరి వివరాలు నామినీతో సహా సేకరించాల్సి ఉంటుంది. అసలు ఏ ప్రాతిపదికన టీటీడీ వీరికి బీమా చెల్లించాలి అనేది ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులు, సిఫారసు లేఖలతో వెళ్లేవారు, టైమ్ స్లాట్ బుకింగ్తో వెళ్లేవారికి చేతిలో ఏదో ఒక ఆధారం ఉంటుంది. అయితే ఉచిత లేదా సర్వదర్శనం క్యూలో వెళ్లే యాత్రికుల వద్ద ఎలాంటి రశీదులూ, ఆధారాలూ ఉండవు. వీరికి అమలు సాధ్యమేనా అనేది సందేహంగా మారుతోంది. అయితే, ఇప్పటి వరకు బీమా అంశం ఆలోచన దశలోనే ఉంది. అమలు చేయాలంటే సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రభుత్వం తోనూ చర్చించిన తరువాత ఈ ప్రతిపాదన పైన కార్యాచరణ రూపొందించనున్నారు. దీని పైన ఆధ్యాత్మిక ప్రముఖుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తిరుమలకు వచ్చే భక్తులకు ఉచిత బీమా సౌకర్యంపై టీటీడీ కసరత్తు ?
June 29, 2025
0
Tags