బంగ్లాదేశ్‌ కరెన్సీపై హిందూ, బౌద్ధ ఆలయాలు

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. మాజీ ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రం ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్‌తో కూడిన నోట్లను విడుదల చేసింది. ఆయన స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తోంది. జూన్‌ 1వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీ మొదలైంది. ''కొత్త డిజైన్‌, సిరీస్‌ ప్రకారం.. కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవు. వీటికి బదులుగా ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయి'' అని బంగ్లాదేశ్‌ బ్యాంక్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. చారిత్రక ప్రదేశాలతో పాటు హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలు ఉంటాయన్నారు. దివంగత చిత్రకారుడు జైనుల్‌ అబెదిన్‌ గీసిన కళాఖండాలు కూడా ఉన్నాయని చెప్పారు. మొత్తంగా తొమ్మిది డిజైన్లను రూపొందించగా జూన్‌ 1న కొత్త నోట్లను విడుదల చేశామన్నారు. తూర్పు పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌గా పేరు మార్చుకున్న తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్‌ను ముద్రించారు. అనంతరం షేక్‌ హసీనా తండ్రి ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమె తండ్రి ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. తాజాగా ఆయన స్థానంలో కొత్తవాటిని విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)