ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ప్రధానంగా బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, మెటల్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా రాణించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు లాభపడగా నిఫ్టీ 25,100 మార్కును దాటింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.446.37 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,354.85 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,361.87) ఫ్లాట్గా ప్రారంభమైంది. రోజంతా భారీ లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 82,494.49 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 1046.30 పాయింట్ల లాభంతో 82,408.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 319 పాయింట్లు లాభపడి 25,112.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.59గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ సుజుకీ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్లు కాగా, బంగారం ఔన్సు 3372 డాలర్లు వద్ద కొనసాగుతోంది.
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
June 20, 2025
0