తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ జరగనుంది. పాత పింఛన్ విధానం, ప్రమోషన్లు, బదిలీలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై తీసుకునే నిర్ణయాల కోసం ఇది కీలకంగా మారింది. వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ విభాగాలు సమర్పించిన నివేదికలపై కేబినెట్లో చర్చించనున్నారు. లోపాల పరిశీలన, బాధ్యుల నిర్ధారణ, తదుపరి చర్యలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. యువత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రాజీవ్ యువ వికాసం' పథకం అమలు అంశంపై కూడ కేబినెట్ చర్చించనుంది. ఇందులో భాగంగా యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు, స్కిల్లింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర పరిపాలనలో కీలక మలుపులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
జూన్ 5న తెలంగాణ కేబినెట్ భేటీ
June 03, 2025
0
Tags