మహారాష్ట్ర లో నిజాం దివాన్ వారసులు రూ.150 కోట్ల విలువైన భూమిని కారు డ్రైవర్కు బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శివసేన ఎంపీ సందీప్ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్ వద్ద జావెద్ రసూల్ షేక్ అనే వ్యక్తి 13 ఏళ్లుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఛత్రపతి శంభాజీనగర్లో ఉంటున్న నిజాం దివాన్ వారసులు రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గీఫ్ట్డీడ్ కింద రాసిచ్చారు. దీనిపై ముజాహిద్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై దివాన్ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని ముజాహిద్ తెలిపారు. అలాంటి భూమిని రక్తసంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్డీడ్గా ఎలా ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు. కాగా, ఈ వివాదంపై జావెద్ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దివాన్ వారసులతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే తనకు ఆ భూమిని రాసిచ్చారని అతడు పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించారని ఎమ్మెల్యే విలాస్ స్పష్టం చేశారు. అయితే, ఈ భూమి బదిలీకి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తాను పోలీసులకు తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్థానిక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గిఫ్ట్ డీడ్పై సంతకం చేసిన వారితో పాటు సంబంధిత కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. డ్రైవర్కు, దివాన్ వారసులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రూ.150 కోట్ల విలువైన భూమిని కారు డ్రైవర్కుబహుమతిగా ఇచ్చిన నిజాం దివాన్ వారసులు ?
June 28, 2025
0
Tags