డిప్యూటీ కలెక్టర్‌ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ కలెక్టర్‌ను తహశీల్దారుగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన డిప్యూటీ కలెక్టర్‌ తాతా మోహన్‌ రావును ఎమ్మార్వోగా డిమోట్‌ చేస్తూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. అంతేకాదు కోర్టు ధిక్కరణ కింద రెండు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్‌ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో (2013-2024) గుంటూరు తహశీల్దారుగా తాతా మోహనరావు పనిచేస్తున్న సమయంలో అడవితక్కెళ్ల పాడులో పేదల గుడిసెలను పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. అయితే యధాతధ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో మోహనరావు సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అధికారులు చట్టానికి అతీతులమన్న భావనతో వ్యవహరించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి అధికారి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు. అతడిని ఒకసారి కోర్టు హెచ్చరించింది అయినా తిరిగి అదే చర్య చేశాడు, అతన్ని ఎలా క్షమించాలి అని జస్టిస్ బీఆర్‌ గవాయ్ ప్రశ్నించింది. తను హైకోర్టు కన్నా పెద్దవాడని అనుకుంటున్నాడా? అని ధర్మాసనం మండిపడింది. ఎన్ని కుటుంబాలను ఖాళీ చేయించావు?, 80 మంది పోలీసులతో వెళ్లి హైకోర్టు ఆదేశాల్ని విస్మరించావు అని తాతా మోహనరావుపై ధర్మాసనం ఫైర్ అయింది. అతను 48 గంటలు కస్టడీలో ఉంటే ఉద్యోగం పోతుందని వ్యాఖ్యానించింది. ప్రతి అధికారికి హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఉందని తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తాతా మోహనరావుకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని న్యాయవాది కోర్ట్ దృష్టికి తెచ్చినప్పుడు.. న్యాయమూర్తి గవాయ్ జోక్యం చేసుకొని అతను ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు, వారి పిల్లలు ఎమవుతారు? అని మండిపడ్డారు. సాధారణ పరిస్థితుల్లో పిటిషన్ తీసుకోవడం సరికాదు, అయినా మేము కొంత సహనాన్ని పాటిస్తూ నోటీసు జారీ చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)