రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు నాయుడు భేటీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ఆయన విన్నవించారు. లేపాక్షి-మడకశిర మధ్య అందుబాటులో ఉన్న 10 వేల ఎకరాల్లో సైనిక, పౌర విమానాల తయారీ, రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఎకో సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు. కర్ణాటక నుంచి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తిని తమ రాష్ట్రానికి తరలించాలని ప్రతిపాదించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఒక గంట సమయం పట్టే దూరంలో ఉన్న లేపాక్షి-మడకశిర హబ్‌లో హెచ్ఏఎల్ కు సంబంధించి ఏఎంసీఏ ఉత్పత్తి సౌకర్యం కోసం పది ఎకరాల భూమిని చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.వేల కోట్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏర్పాటు చేయాలని, దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్నా ఏపీలో లేదని ఆయన అన్నారు. కొత్తగా సైనిక్ స్కూళ్లు ఇవ్వాలని, తిరుపతి ఐఐటీలో డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.అలాగే జగ్గయ్యపేట-దొనకొండ క్లస్టర్‌లో 6 వేల ఎకరాల్లో క్షిపణులు, ఆయుధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖపట్నం - అనకాపల్లి క్లస్టర్‌లో నౌకా రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి, ఆయుధాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు - ఓర్వకల్లు మధ్య నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అక్కడ సైనిక డ్రోన్లు, రోబోటిక్స్, ఆధునిక రక్షణ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగంలోని రక్షణ పరిశ్రమల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వాటి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతపురం జిల్లా పాలసముద్రంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను వేగంగా పూర్తి చేయాలని, మిధాని-నాల్కో ఆధ్వర్యంలో నెల్లూరులో 60 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అల్యూమినియం ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరగా ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.బెంగళూరు-హైదరాబాద్ కారిడార్‌లో లేపాక్షి-ఓర్వకల్లు మధ్య ఎలక్ట్రానిక్ సిటీ రాబోతుందున్నారు. త్వరలోనే ఎంవోయూ చేసుకుంటామని తెలిపారు. మూడు నెలల్లో సిటీ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని చెప్పామని, భూకేటాయింపులు త్వరగా పూర్తి చేసి ముందడుగు వేస్తామని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణంలో యాపిల్‌తో పాటు ఇతర ఉత్పత్తిదారులు కూడా భాగస్వాములు అవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ సిటీకి కావలసిన మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి బాధ్యత ఆయా సంస్థలదేనన్నారు. లేపాక్షి-ఓర్వకల్లు మధ్య పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. బెంగళూరు, పుట్టపర్తి, ఓర్వకల్లు, హైదరాబాద్ విమానాశ్రయాలు దగ్గరలో ఉండటం, కృష్ణపట్నం పోర్టు అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశాలన్నారు. ఇక్కడ మరో విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల రక్షణ రంగ సంస్థలు కూడా ఎక్కువగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో సైన్యానికి, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే డ్రోన్లు తయారు చేస్తామని, దీనిని దేశానికి ఒక హబ్‌గా తయారు చేస్తామని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ను కలిసి శ్రీహరికోట వద్ద స్పేస్‌సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం సమీపంలోనే రెండు వేల ఎకరాల్లో క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రైవేటు ఉపగ్రహాల తయారీ, ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)