ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులతో అదరగొట్టారు. ఈ విద్యార్థుల అపూర్వ విజయాన్ని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. వారి కృషి, అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది పాలిసెట్లో 95.36శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈసారి మొత్తంగా 1,39,840 మంది పాలిసెట్ రాయగా, వీరిలో 1,33,358 మంది పాసైనట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 30న పాలిసెట్-2025 పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,840 మంది పరీక్ష రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
ఏపీ పాలిసెట్లో 19మందికి 120/120 మార్కులు
May 14, 2025
0
Tags