హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కంచ భూముల వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రారును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దని సీఎస్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ పై సుప్రీంకోర్టు ఎటువంటి స్టే ఇవ్వడం లేదు. మరోవైపు హెచ్సీయూలో ఉద్రిక్తత కొనసాగుతుంది. 400 ఎకరాలపై ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. 400 ఎకరాలను కాపాడాలంటూ విద్యార్ధులు నిరసన గళమెత్తుతున్నారు. విద్యార్ధుల ఆందోళనలకు మద్దతు పెరుగుతుంది. టాలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ బాగానే వస్తోంది. 400 ఎకరాల్లో ఉన్న ప్రకృతిని, నెమళ్లు, జింకలను రక్షించాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ కు రేణుదేశాయ్, యాంకర్ రష్మీ విజ్ఞప్తి చేశారు.
తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దు : సుప్రీంకోర్టు
April 03, 2025
0
Tags