దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో దూసుకెళ్లిన ఫార్మా స్టాక్స్ నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. త్వరలో ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమే ఇందుకు కారణం. దీంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఏకంగా 4.2 శాతం పతనమైంది. ఇంట్రాడేలో 20,521.70 వద్ద కనిష్ఠాన్ని తాకింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ఇప్పటికే సుంకాల్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో ఫార్మా ఉత్పత్తులు, సెమీ కండక్టర్లపై కూడా పన్ను విధిస్తానని వ్యాఖ్యానించారు. ఫార్మా ఒక ప్రత్యేక వర్గం అని పేర్కొన్న ట్రంప్ ఈ రంగంపై టారిఫ్ అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుందని పేర్కొన్నారు. పరస్పర సుంకాల్లో ఫార్మాకు మినహాయింపు లభించిందన్న కారణంతో నిన్న రాణించిన ఔషధ రంగ స్టాక్స్ తాజా ప్రకటనతో కుదేలవుతున్నాయి. అరబిందో ఫార్మా 6.25 శాతం, ఐపీసీఏ లేబొరేటరీస్ 6.51 శాతం, లుపిన్ 5.35 శాతం, బయోకాన్ 5.05 శాతం కుంగాయి. సిప్లా, దివీస్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా షేర్లు దాదాపు 3 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై ట్రంప్ ఎఫెక్ట్ !
April 04, 2025
0
Tags