హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అనూహ్యంగా వచ్చిన ఈ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పదర మండలం కూడన్పల్లి సమీపంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతిచెందారు. మృతి చెందిన వారిని ఈదమ్మ (55), సైదమ్మ (35) గా గుర్తించారు. మరికొందరికి సైతం గాయలవగా వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అవ్వగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
April 03, 2025
0
Tags