సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. మూడేళ్లకు ఒకసారి జరిగే సీపీఎం మహాసభలు తమిళనాడులోని మదురైలో ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆయనను పార్టీ కొత్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఎంఏ బేబీ పేరును పార్టీ కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్ ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో సీతారాం ఏచూరి మృతి అనంతరం ఆ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలికంగా కారత్ ఆ పదవిని నిర్వహిస్తూ వచ్చారు. మైనారిటీ కమ్యూనిటీ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి నేత బేబీనే కావడం విశేషం. కేరళ లోని కొల్లాం జిల్లా ప్రక్కులాంలో జన్మించిన బీఏ బేబీ (70) కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో ప్రారంభించి ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత పార్టీ యూత్ వింగ్ డీవైఎఫ్ఐలో పనిచేశారు. 1986 నుంచి 1998 వరకూ సీపీఎం రాజ్యసభ సభ్యుడిగా ఆయన సేవలందించారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థులను, యువతను సమీకరించి జైలుశిక్ష కూడా అనుభవించారు. 2006లో కేరళలోని కుందర నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2006 నుంచి 2011 వరకూ వీఎస్ అచ్యుతానంద్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో తిరిగి కుందర నియోజకవర్గం నుంచే తిరిగి గెలుపొందారు. 2012 నుంచి సీపీఎం పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ
April 06, 2025
0
Tags