బీఎస్ఎన్ఎల్ గత ఆరు నెలలలో 55 లక్షల కొత్త కస్టమర్లను పొందినట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. 2024 ఆగస్టు నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈ సంస్థ కొత్త కస్టమర్లను పొందింది. జూన్ 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు, బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 85.5 మిలియన్ల నుంచి 91 మిలియన్లకు పెరిగింది. ప్రైవేటు కంపెనీల గట్టి పోటి ఇస్తున్న సమయంలో కూడా బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం విశేషమనే చెప్పాలి. అయితే ప్రైవేట్ సంస్థలు తమ రీఛార్జ్ ధరలను పెంచిన క్రమంలో అనేక మందికి బీఎస్ఎన్ఎల్ ప్రత్యమ్నాయ మార్గంగా నిలుస్తోంది. పొలిటికల్, కమర్షియల్ అండ్ సర్వీస్ రంగాలలో దాని ప్రతిష్టను పెంచడం కోసం బీఎస్ఎన్ఎల్ "కస్టమర్ సర్వీస్ మాసం"ను ప్రారంభించింది. ఇది ఏప్రిల్ నెలలో అమలు చేయనున్నారు. ఈ నెలలో, బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల అభిప్రాయాలను సేకరించడం ద్వారా సేవా నాణ్యతను మెరుగుపరచుకోనుంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ తన నెట్వర్క్ సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. జూన్ 2025 నాటికి 104,000 కొత్త 4G టవర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే, దాదాపు 80,000 టవర్లు నిర్మించబడ్డాయి. ఈ టవర్లు ప్రత్యేకంగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడ్డాయి. వాటిని 5G నెట్వర్క్కు సులభంగా అప్గ్రేడ్ అయ్యేలా రూపొందించబడ్డాయి. కొత్త కస్టమర్ల సంఖ్య పెరగడంతో సంస్థ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక సంస్థగా, ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడి, బీఎస్ఎన్ఎల్ తన స్థానాన్ని పునరుద్ధరించుకుంది. బీఎస్ఎన్ఎల్ 4G రోలౌట్ను పూర్తిచేసిన తర్వాత, 5G నెట్వర్క్ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం కూడా మొదలు పెట్టింది. 5G నెట్వర్క్ను అనేక నగరాల్లో పరీక్షించి, పూర్తిగా అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం BSNL పూణే, కోయంబత్తూర్, కాన్పూర్, విజయవాడ, కొల్లం వంటి ప్రధాన నగరాల్లో 5G టెక్నాలజీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం, దేశంలో మొబైల్ సేవలు అందించే ప్రధాన కంపెనీలలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, జియో, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ కొనసాగుతోంది.
91 మిలియన్లకు పెరిగిన బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు !
April 05, 2025
0
Tags