ఆంధ్రప్రదేశ్ కి 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి త్వరలో 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పీఎం-ఇ-బస్ సేవా పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర సర్కార్ ప్రవేశపెడుతోంది. మొత్తం 20 వేల కోట్లతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తీసుకొస్తోంది. ప్రస్తుతం బస్ బాడీలు సైతం సిద్ధం చేసిన కాంట్రాక్ట్ సంస్ధ, రాష్ట్రానికి బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయడమే తరువాయి రాష్ట్రంలోని నగరాల్లో విద్యుత్ బస్సులు అందుబాటు లోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని 11 నగరాల్లో 1050 బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఆమోద ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం, తొలుత 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, ఆధ్వర్యంలో తొలి దశలో రానున్న 750 ఈ బస్సుల కోసం టెండర్లు పిలిచి అర్హత కలిగిన సంస్థల కాంట్రాక్ట ర్లను ఖరారు చేసింది. టెండర్లలో పుణెకు చెందిన పిన్నాకిల్ మొబిలిటీ సెల్యూషన్స్ సంస్థ L1 గా నిలిచి రాష్ట్రంలో ఈ బస్సులు తిప్పే కాంట్రాక్టు దక్కించుకుంది. నగరాల్లో 12 మీటర్లు, 9 మీటర్లు పొడవు ఉన్న రెండు విభాగాల్లో విద్యుత్తో నడిచే ఏసీ సిటీ బస్సులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి వస్తోన్న750 బస్సులన్నీ సిటీ ఏసీ బస్సులుగా తిరగనున్నాయి. విశాఖపట్నం నగరానికి 100 సిటీ బస్సులు మంజూరయ్యాయి. సింహపురి డిపోకు 50, గాజువాక డిపోకు 50 బస్సులు కేటాయించారు. విజయవాడ నగరానికి 100 బస్సులు మంజూరు కాగా ఇవన్నీ విద్యాధరపురం డిపోకు కేటాయించారు. అక్కడే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నగరంలో గుంటూరు -2 డిపోకు 100 బస్సులు రానున్నాయి. కొత్త బస్సులు రానున్న దృష్ట్యా అవసరమైన సిబ్బంది నియామకం పైనా ఆర్టీసీ దృష్టి సారించింది. డిపోల్లో అవసరమైన వారి నియామకం ఏ ప్రాతిపదికన చేయాలనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకుని అమలు చేయనుంది. మూడు నెలల్లో అన్ని ఏర్పాట్లు చేసి, బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)