బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 గ్రాములకు రూ.960 తగ్గించింది. దీంతో దిగుమతి సుంకం ధర ఇప్పుడు 10 గ్రాములకు రూ.80,965కు చేరింది. మార్కెట్లో ప్రస్తుత పరిస్థితుల వల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా డాలర్ ఇతర దేశాల ప్రధాన కరెన్సీలతో పోల్చితే బలపడడం అమ్మకాల ఒత్తిడికి కారణమైంది. అలాగే పెట్టుబడిదారులు లాభాలను పొందటానికి తమ బంగారాన్ని విక్రయిస్తున్నారు. బంగారం దిగుమతి సుంకం అంటే దేశంలోకి దిగుమతి చేసుకున్న పసిడిపై ప్రభుత్వం విధించిన డ్యూటీని గణించడానికి నిర్ణయించిన మూల ధర అని చెప్పుకోవచ్చు. బంగారాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు దిగుమతిదారులు పన్ను చెల్లించాలి. ప్రభుత్వం బంగారం కోసం ఒక నిర్దిష్ట ధరను నిర్ణయిస్తుంది. దిగుమతిదారులు ఎంత పన్ను చెల్లించాలో లెక్కించడానికి ఈ ధరను వాడతారు. బంగారంతో పాటు వెండి దిగుమతి సుంకం ధరను కూడా కిలోకి రూ.1,571 చొప్పున తగ్గించారు. దీంతో ఇప్పుడు దిగుమతి సుంకం ధర కిలోకి రూ.89,474 గా ఉంది. కొన్ని వారాల వ్యవధిలో వెండికి సంబంధించి రెండోసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బేస్ దిగుమతి ధరను కిలోకి రూ.3,666 పెంచింది. బంగారం, వెండికి సంబంధించిన దిగుమతి సుంకం ధరలను ప్రతి 15 రోజులకి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. ప్రపంచంలోనే వెండిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. అత్యధిక బంగారాన్ని దిగుమతి చేసుకన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. దీంతో భారత్ దిగుమతి విధానాలు ప్రపంచ బంగారం, వెండి మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఫిబ్రవరిలో భారత బంగారం దిగుమతులు సుమారు 15 మెట్రిక్ టన్నులకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)