ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖార్గేతో విజయశాంతి భేటీ అయి రాష్ట్రంలో ప్రభుత్వం , పార్టీ వ్యవహారాల పైన చర్చించారు. తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో పార్టీ అధినేత నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం యాక్టివ్ గా పని చేయాలని సూచించారు. ఇప్పుడు విజయశాంతికి పదవి విషయంలో రేవంత్ నిర్ణయం కీలకంగా మారనుంది. కాంగ్రెస్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అయిదు ఎమ్మె ల్సీ స్థానాలకు ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనుంది. అయిదు స్థానాల్లో ఒకటి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వెళ్లనుంది. కాంగ్రెస్ కు దక్కే నాలుగు సీట్లలో ఒకటి మిత్రపక్షం సీపీఐకు కేటాయించే లా నిర్ణయం జరిగింది. సీపీఐ నుంచి చాడా వెంకటరెడ్డికి ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక, కాంగ్రెస్ ఒక సీటు తమకు కేటాయించాలని ఎంఐఎం అధినేత అసద్ నేరుగా సీఎం రేవంత్ కు ఫోన్ చేసి అభ్యర్ధించారు. త్వరలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తా మని రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో, మూడు స్థానాలు కాంగ్రెస్ కే దక్కనున్నాయి. ఈ మూడు స్థానాలకు అభ్యర్ధుల ఎంపిక పైన రేవంత్ ఇప్పటికే తన ప్రతిపాదనలు సిద్దం చేసారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ఈ రోజు అభ్యర్ధుల అంశం పైన పార్టీ అధినాయకత్వంతో చర్చించనున్నారు. ఓసీ, ఎస్సీ, మైనార్టీలకు అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఓసీని తప్పించి.. బీసీ, ఎస్సీ, మైనార్టీకి ఛాన్స్ ఇస్తారని మరో వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే మాజీ ఎంపీ విజయశాంతి నేరుగా ఏఐసీసీ చీఫ్ ఖార్గేతో భేటీ అయ్యారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పని చేసిన విజయశాంతి..2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వంలో విజయశాంతికి ప్రాధాన్యత ఉంటుందని తొలుత భావించారు. 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విజయశాంతి తిరిగి మెదక్ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, విజయశాంతి పోటీకి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నేరుగా ఢిల్లీ నుంచి తన రాజకీయ రీ ఎంట్రీ ఇవ్వాలని విజయశాంతి భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంపిక వేళ ఢిల్లీలో పార్టీ చీఫ్ తో సమావేశం అయ్యారు. మహిళా కోటాలో తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. దీని ద్వారా రాష్ట్రంలో పార్టీ కోసం శక్తి మేర పని చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఖర్గే సైతం సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్ కు మూడు దక్కనున్నాయి. ఈ మూడు సీట్ల కోసం దాదాపు 14 మంది ముఖ్యులు రేసులో ఉన్నారు. గతంలో హామీ ఇచ్చిన వారితో పాటుగా పార్టీలో సీనియర్లు గా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా పార్టీ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు. ఈ సారి ఎమ్మెల్సీల ఖరారులో కొత్త ఇంఛార్జ్ అభిప్రాయం కీలకం కానుంది. ఇక.. విజయశాంతికి ఈ విడత ఎమ్మెల్సీ సీటు ఇస్తారా.. మలి విడత పరిశీలిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయం లో విజయశాంతికి ప్రాధాన్యత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయం కీలకం కానుంది. దీంతో, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక ఇప్పుడు పార్టీలో ఆసక్తిని పెంచుతోంది.
విజయశాంతికి కీలక పదవి ?
March 07, 2025
0
Tags