గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో పాఠాలు సరిగా చెప్పడం లేదంటూ ఒక ఉపాధ్యాయుడిపై స్కూల్ ప్రిన్సిపాల్ దాడి చేశాడు. 25 సెకన్లలో 18 చెంపదెబ్బలు కొట్టాడు. అక్కడున్న మిగతా టీచర్లు ఇది చూసి షాక్ అయ్యారు. జోక్యం చేసుకుని వారిని విడిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 6న నవయుగ్ స్కూల్ ప్రిన్సిపాల్ హితేంద్ర ఠాకూర్ తన రూమ్ లో కొందరు టీచర్లతో సమావేశం నిర్వహించాడు. గణితం, సైన్స్ ఉపాధ్యాయుడు రాజేంద్ర పార్మెర్ విద్యార్థులకు పాఠాలు సరిగా చెప్పకపోవడం, ఆయనపై వచ్చిన ఆరోపణలపై నిలదీశాడు. టీచర్ రాజేంద్ర దురుసుగా సమాధానం చెప్పడంతో ప్రిన్సిపాల్ హితేంద్ర ఆగ్రహంతో రగిలిపోయి తన సీటు నుంచి లేచి అతడిపై దాడి చేశాడు.అక్కడున్న మిగతా టీచర్లు వారిని విడిపించారు. మరోవైపు వారిద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది. దీంతో ప్రిన్సిపాల్ హితేంద్ర మరోసారి దాడికి పాల్పడ్డాడు. కుర్చీలో కూర్చొన్న టీచర్ రాజేంద్ర కాలు పట్టుకుని లాగి కింద పడేసి పదేపదే కొట్టాడు. తీవ్రంగా ప్రతిఘటించేందుకు ఆ టీచర్ ప్రయత్నించాడు. అక్కడున్న మిగతా టీచర్లు మళ్లీ వారిద్దరిని విడిపించారు. కాగా, ప్రిన్సిపాల్ రూమ్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి వెల్లడించారు.
విద్యార్థులకు పాఠాలు సరిగా చెప్పకపోవడంతో ఉపాధ్యాయుడిపై ప్రిన్సిపాల్ దాడి !
February 10, 2025
0
Tags