టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది !

Telugu Lo Computer
0


నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఎస్ఎల్బీసీ ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. దీంతో పలువురు ఇంజినీర్లు అందులోనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారిని కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతోంది. ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలిని పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారని, ఆ తర్వాత అరగంటకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో టన్నెల్‌లో ఒకవైపు నుంచి నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్ధం వచ్చిందని తెలిపారు. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందు పసిగట్టారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన 42 మంది కార్మికులు బయటకు తీసుకొచ్చారు. అయితే, బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి ప్రాణాలు రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్‌లో వారిని రెస్క్యూ చేసిన నిపుణులతో మాట్లాడామని మంత్రి తెలిపారు. టన్నెల్ లో చిక్కుకుపోయినవారు ఉత్తరాఖండ్, జార్ఖండ్ వాసులున్నారని చెప్పారు. వారిలో ఒక ప్రాజెక్ట్ ఇంజినీర్, ఫీల్డ్ ఇంజినీర్, నలుగురు కార్మికులు, జమ్మూకాశ్మీర్, పంజాబ్‌కు చెందిన ఇద్దరు బోరింగ్ మిషన్ ఆపరేటర్లు ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసుకురావడం కష్టసాధ్యంగా మారిందన్నారు. రెస్క్యూ టీంలు శనివారం రాత్రి ప్రమాద ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడతామని మంత్రి వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)