తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేరు లేకపోయినా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించడంతో సర్వర్లు సరిగ్గా స్పందించడం లేదని కొందరు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మీ సేవాలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవడంతో ఇంకా దరఖాస్తు చేయనివారు తమకు కార్డు వస్తుందా లేదా అనే సందేహంలో ఉన్నారు. జనవరి 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న చాలా మందికి రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మరోసారి స్పష్టతనిచ్చింది. దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని తెలిపింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు ఎప్పుడు కావాలన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని తెలిపింది. ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు తమ రశీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. అంతేకాదు గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు కూడా మీ సేవాలో మళ్లీ దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు.
రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుంది !
February 13, 2025
0
Tags