నిషేధిత చైనా యాప్‌లు పేర్లు, వెర్షన్లు మార్చి మళ్లీ ప్రత్యక్షం ?

Telugu Lo Computer
0


దేశీయ భద్రత, డేటా గోప్యతపై ఆందోళన కారణంగా నిషేధించిన చైనా యాప్‌లు తిరిగి భారత్‌లోకి వచ్చేశాయి. యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి మళ్లీ విడుదలయ్యాయి. ఆ యాప్‌లలో కొన్నింటికి యాజమాన్య హక్కులు మారగా, మరికొన్ని చైనా కంపెనీలుగానే కొనసాగుతున్నట్లు సమాచారం. భద్రతా సమస్యల కారణంగా 2020లో దాదాపు 267 చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది. సరిహద్దులోని గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్‌ ఈ చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి తిరిగి భారత్‌లో విడుదలయ్యాయి. గతంలో నిషేధించిన యాప్‌లలో 36 అప్లికేషన్లు తిరిగి భారత్‌లోకి వచ్చాయి. వాటిలో కొన్ని బ్రాండింగ్‌, లోగోల్లో చిన్న మార్పులు చేసి తీసుకొచ్చారు. వీటిలో ఫైల్‌- షేరింగ్‌ సర్వీస్‌ Xender, స్ట్రీమింట్‌ ప్లాట్‌ఫామ్‌ మ్యాంగో టీవీ, షాపింగ్‌ యాప్‌ టావోబావో, డేటింగ్‌ యాప్‌ టాన్‌టాన్‌, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫైల్‌ షేరింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌కు చెందిన అప్లికేషన్లు ఉన్నాయి. ఈ యాప్‌లన్నీ ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. నిషేధిత చైనా యాప్‌లు భారత్‌లోకి తిరిగి ప్రవేశించడానికి వేర్వేరు మార్గాలు ఎంచుకున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ రిటైలర్‌ అయిన షీన్‌.. రిలయన్స్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం ద్వారా భారత్‌కు తిరిగి వచ్చింది. షీన్‌కు సంబంధించిన వినియోగదారుల డేటా ఇప్పుడు భారత్‌లోనే స్టోర్‌ అవుతుందని, చైనాస్‌ మాతృ సంస్థకు యాక్సెస్‌ లేదని భారత్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ అనేక యాప్‌లు క్లోన్‌ వెర్షన్‌లు తెరపైకి వస్తున్నాయి. వాటిని పూర్తిగా బ్యాన్‌ చేయడం కష్టంగా మారుతోంది. ఉదాహరణకు.. 2020లో పబ్‌జీ నిషేధించారు. కానీ 2021లో దక్షిణ కొరియా క్రాప్టన్‌ ఆధ్వర్యంలో బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియాగా తిరిగి వినియోగంలోకి వచ్చింది. అయితే ఇది కూడా 2022లో నిషేధం ఎదుర్కొంది. ఆ తర్వాత దేశీయ భద్రత, ప్రమాణాలను అనుసరించి 2023లో పునరుద్ధరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)