ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను 3.22 లక్షల కోట్లతో ప్రతిపాదించారు. బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల్లో రెండు అమలు దిశగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు, మూల ధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లుగా పేర్కొన్నారు. ఇక.. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేసారు. మహిళలకు అమలు చేయాల్సిన రెండు పథకాల పైన మాత్రం బడ్జెట్ లో ప్రస్తావన చేయలేదు. తల్లికి వందనం పథకం అమలు కోసం ఈ ఏడాది రూ .9,407 కోట్లు కేటాయించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. మే లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ 20 వేలు జమకు నిర్ణయించారు. కేంద్రం పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇచ్చే రూ 6 వేల ను మినహాయించి మిగిలిన 14 వేలు మూడు విడతల్లో జమ చేయనున్నారు. ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకం కోసం రూ 6,300 కోట్లు కేటాయించారు. అయితే దాదా పు గా 55 లక్షల మంది రైతులు అర్హులుగా అంచనా వేస్తున్నారు. దీంతో, ఈ నిధుల కేటాయింపు పైన చర్చ జరుగుతోంది. ఇక.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి ఈ సారి బడ్జెట్ లో ప్రస్తావన చేయలేదు. ఇప్పటికే ఈ నిర్ణయం అమలు కోసం మంత్రుల కమిటీ ని ఏర్పా టు చేసారు. ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారు. ఉగాది నుంచి ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతూ వచ్చారు. అయితే, ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయకపోవటం తో ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ.250 నుంచి రూ.260 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఇక.. సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతీ మహిళకు నెలకు రూ 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ బడ్జెట్ లో ఈ పథకం అమలు గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. నిరుద్యోగ భృతి హామీ గురించి బడ్జెట్ లో ఊసే లేదు. ఉద్యోగం వచ్చేంత వరకు 'నిరుద్యోగ భృతి' కింద నెలకు రూ 3 వేలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇందు కోసం అధికారులు సుమారు నెలకు రూ 2100 కోట్లు అవసరమని అంచనా వేసారు. ఈ బడ్జెట్ లో ఈ నిర్ణయం అమలు దిశగా ఎలాంటి నిర్ణయం లేదని తెలుస్తోంది. దీంతో, మహిళలకు సంబంధించిన ఈ రెండు పథకాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు 2025- 26 ఆర్దిక సంవత్సరంలో అమలు ఉంటుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం పెద్దగా భారం కాకపోవటంతో ఎప్పుడైనా అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్న వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అదే విధంగా ఈ సారి రెండు పథకాలకు నిధులు కేటాయించటంతో.. దశల వారీగా ఇతర పథకాలు అమలు చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. వీటి పైన ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 3.22 లక్షల కోట్లతో ప్రతిపాదన !
February 28, 2025
0
Tags