ముగిసిన మహా కుంభమేళా !

Telugu Lo Computer
0


హాకుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మేళాలో 65 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కుంభమేళా అనేది ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది. ప్రయాగ్‌రాజ్‌లో తదుపరి మహా కుంభమేళా 2169 సంవత్సరంలో జరుగుతుంది. రాబోయే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు మన దేశంలో జరుగుతాయి. 2027లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో, మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళాలు జరుగుతాయి. 2027లో హరిద్వార్‌లో జరగబోయేది అర్ధ కుంభమేళా. నాసిక్‌లో జరగబోయేది పూర్ణ కుంభమేళా. గోదావరి నది పవిత్ర ఒడ్డున నాసిక్ నుంచి 38 కి.మీ దూరంలోని త్రయంబకేశ్వర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్ధ కుంభమేళా ఆరేళ్లకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. 2028లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. ఇది పూర్ణ కుంభమేళా. శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళాను నిర్వహించనున్నారు.ఇందుకోసం ఉజ్జయినిలో 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2030లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అర్ధ కుంభమేళా జరుగుతుంది. మహా కుంభమేళా నేపథ్యంలో లద్దాఖ్​కి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్​ వాంగ్​చుక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. 144ఏళ్ల తర్వాత మహా కుంభమేళా జరిగే సమయానికి నదులు ఎండిపోయే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. మట్టి మీద మహాకుంభ మేళాను చేసుకోవాల్సి రావొచ్చన్నారు. భారత్‌లోని ప్రధాన నదులకు మూలమైన హిమాలయ హిమానీనదాలు కరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని వాంగ్ చుక్ సూచించారు. హిమానీనదాలను కాపాడుకోవాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)