ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశమై కొత్త సీఈసీని ఖరారు చేయనుంది. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలెక్షన్ కమిటీలో ప్రధానితోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ కొత్త సీఈసీ పేరును ఖరారు చేయనుంది. సీఈసీ హోదాలో రాజీవ్ కుమార్ చివరగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలు కూడా రాజీవ్ కుమార్ నేతృత్వంలోనే జరిగాయి. కొత్తగా ఎంపికయ్యే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో ఈ ఏడాది చివరన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా త్వరలో అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు కానుంది. రాజీవ్ కుమార్ 2022 మే నెలలో సీఈసీగా ఎంపికయ్యారు. పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలపాటు హిమాలయాలకు వెళ్లనున్నట్లు రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా వెల్లడించారు. తిరిగొచ్చిన తర్వాత పేద పిల్లలకు విద్యాబోధన చేస్తానని అన్నారు.
17న నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం
February 14, 2025
0
Tags