ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఆటో డ్రైవర్పై ఓ మహిళ దాడి చేసింది. ఆటో ఛార్జీ విషయంలో గొడవ జరగడంతో, డ్రైవర్పై యువతి చేయి చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాడి చేసిన మహిళ ప్రియాన్షి పాండే స్వయంగా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈ క్లిప్పింగ్ షేర్ చేయడం గమనార్హం. ఆమె డ్రైవర్ను కొడుతూ, తిడుతూ నానా హంగామా చేసింది. వీడియోలో ఆమె ఆటో డ్రైవర్ శుక్లా కాలర్ పట్టుకుని ఆటో నుంచి దిగమని అరవడం కనిపిస్తుంది. డ్రైవర్ శుక్లా, 'హమ్ కుచ్ నహీ కహే హై ఆప్కో (నేను మిమ్మల్ని ఏమీ అనలేదు)' అనడం వినిపిస్తుంది. కానీ ఆమె కొట్టడం ఆపలేదు. శుక్లా తన చేతులు జోడించి, పదే పదే వేడుకున్నప్పటికీ ప్రియాన్షి ఆగలేదు. పదే పదే అతడి చెంపలపై కొట్టింది. ఆమె ఆటోలో డ్రైవర్ సీటులోకి ఎక్కి మరీ డ్రైవర్ను కొట్టింది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్లా మాట్లాడుతూ, 'నేను వారిని డ్రాప్ చేసిన తర్వాత ఛార్జీ అడిగాను. వారు విద్యార్థులమని చెప్పి ఛార్జీ ఇవ్వలేదు. నేను ఛార్జీలు డిమాండ్ చేస్తూనే ఉండగా, వారిలో ఒకరు నా కాలర్ పట్టుకున్నారు. ఆ యువతి మొబైల్ని తన సోదరికి ఇచ్చి రికార్డ్ చేయమని అడిగింది. అప్పుడు నేను డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పాను. నేను వారిని ముట్టుకోలేదు. కానీ వాళ్లు నాపై దాడి చేయడం మొదలు పెట్టారు. చివరికి ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి, నా పరువు తీశారు. నాకు న్యాయం జరగాలి. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ గొడవలో నాకు ఛాతీపై గాయాలు కూడా అయ్యాయి.' అని తెలిపాడు. అయితే వైరల్ వీడియోపై ప్రియాన్షి పాండే కొత్త వాదన వినిపిస్తోంది. ఆటోడ్రైవర్ తనను అసభ్యంగా తిట్టాడని, అందుకే తిరిగి కొట్టానని చెబుతోంది. తన పర్సనల్ ఐడీ నుంచి వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించింది. మీర్జాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో డ్రైవర్పై మహిళ దాడి !
January 17, 2025
0
Tags