ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని, ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది సుందరం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా? అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కేటీఆర్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు !
January 15, 2025
0
Tags