ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఖలిస్థాన్ సానుభూతిపరులు ఆయనపై దాడికి కుట్ర పన్నారని నిఘా వర్గాల సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు ఢిల్లీలోనూ, అటు పంజాబ్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ప్రధానంగా కేజ్రీవాల్పై దాడి జరగవచ్చని అనుమానిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ఖలిస్థానీ మద్దతుదారులు ఢిల్లీకి బయలుదేరినట్టు కూడా చెబుతున్నారు. దీని వెనుక పాక్ ఐఎస్ఐ హస్తం ఉందని కూడా అనుమానిస్తున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తు్న్న కేజ్రీవాల్ బుధవారంనాడు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిఘా వర్గాల హెచ్చరికలపై మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ''ఉపర్వాలా బచాయేగా..'' అంటూ సమాధానమిచ్చారు. భగవంతుడి చూపు ఎవరి వైపు ఉందో వారిని ఎవరూ ఏమీ చేయలేరని, దైవం తనతో ఉందని చెప్పారు. ఎవరైనా ఆయుష్షు ఎంతుంటుందో అంతకాలమే బతుకుతారని, అది పూర్తి కాగానే దేవుడు పిలిపించుకుంటాడని అన్నారు. కాగా, కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రాథమిక సమచారం ఉందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ 'జడ్ ప్లస్' క్యాటగిరి భద్రతలో ఉన్నారు. పైలట్, ఎస్కార్ట్ టీమ్, క్లోజ్ ప్రొటక్షన్ స్టాఫ్, సెర్చ్ అండ్ ఫ్రిస్క్ యూనిట్లతో సహా 63 మంది సిబ్బంది ఆయనకు రక్షణగా ఉన్నారు
ఖలిస్థాన్ సానుభూతిపరుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు !
January 15, 2025
0
Tags