స్టాక్ మార్కెట్లకు నేడు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ లో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 74వేల మార్క్ను దాటగా, నిఫ్టీ 22,500 మైలురాయి పైన స్థిరపడింది. మొత్తం రెండు సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించగా.. ఇందులో సెన్సెక్స్ 88.91 పాయింట్లు లాభపడి 74,005.94 వద్ద, నిఫ్టీ 35.9 పాయింట్ల లాభంతో 22,502 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటర్స్ షేరు విలువ దాదాపు 2 శాతం పెరగ్గా.. జేఎస్డబ్ల్యూ స్టీల్ షేరు విలువ పతనమైంది. సాధారణంగా శనివారం మార్కెట్లు పనిచేయవు. కానీ, ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించాయి. రెండు సెషన్లలో ఈ ప్రత్యేక ట్రేడింగ్ కొనసాగింది. మొదటి సెషన్ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై 10.15 గంటలకు.. రెండో సెషన్ 11.30 - 12.30 గంటల మధ్య ముగిసింది. తొలుత ప్రాథమిక సైట్లో.. తర్వాత డిజాస్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ చేశారు. ఈ సమయంలో అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. గరిష్ఠ పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు.
స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్ లో లాభపడ్డ సూచీలు !
May 18, 2024
0
Tags