కర్ణాటక ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ఈనెల 14వ తేదీ వరకూ జ్యూడిషయల్ కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలను హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ ఎదుర్కొంటుండగా, బాధిత మహిళను అపహరించిన కేసును హెచ్డీ రేవణ్ణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో హెచ్డీ రేవణ్ణకు విధించిన మూడు రోజుల పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. దీంతో ఆయనను కోర్టు ముందు హాజరుపరచారు. కోర్టు ఈనెల 14వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను పరప్పన అగ్రహార జైలుకు సిట్ తరలించింది. పోలీసు కస్టడీలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని విచారణ సందర్భంగా కోర్టు ఆయనను ప్రశ్నించింది. కడుపునొప్పి కారణంగా తాను గత మూడు రోజులుగా నిద్రపోలేదని, విచారణ పూర్తయిందని వారు చెప్పారని తెలిపారు. తాను ఏదైనా తప్పుచేసి ఉండే అంగీకరించేందుకు సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యేగా 25 ఏళ్ల కాలంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కడుపునొప్పి విషయాన్ని అధికారులకు చెప్పినప్పటికీ తాను ఆసుపత్రిలో చేరలేదని తెలిపారు. తనకు నిరంతరాయంగా కడుపునొప్పి వస్తోందని, వారెంట్ లేకుండానే తనను అరెస్టు చేశారని చెప్పారు. తాను ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయలేదని, అది కూడా అరెస్టుకు ముందు ప్రెస్తో మాట్లాడానని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు బనాయించడం ద్వారా రాజకీయ కుట్ర జరుగుతోందని రేవణ్ణ విచారణ సందర్భగా పేర్కొన్నారు. విచారణ పూర్తయిందని చెప్పినప్పటికీ మంగళవారం ఉదయం రెండు గంటల సేపు తనను ఇంటరాగేట్ చేశారని కోర్టుకు తెలిపారు. హెచ్డీ రేవణ్ణ ఫామ్హౌస్లో గతంలో పనిచేసిన ఒక మహిళను ఏప్రిల్ 29న అపహరణకు గురి కాగా, ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో హెచ్డీ రేవణ్ణ, ఆయన సన్నిహితుడు సతీష్ బాబన్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హెచ్డీ రేవణ్ణకు 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ !
May 08, 2024
0
Tags