టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పొత్తులపై చర్చలు అనంతరం ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమిత్ షాతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు ఖరారైందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తులని చంద్రబాబు నేతలకు వివరించారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. రాష్ట్రానికి మేలు జరిగేలా బీజేపీ కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీడీపీ అధినేత తెలిపారు. ఇదిలా ఉంటే బీజేపీతో సీట్ల పంపకంపై చివరి దశకు చేరుకుందని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చంద్రబాబు నేతలకు తెలిపారు. టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, కేంద్రం సహకారం అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చంద్రబాబు నేతలకు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ నెల 17న టీడీపీ-జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని, మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని నేతలతో చంద్రబాబు తెలిపారు. మోడీ పాల్గొనే సభకు ఒక రోజు అటు ఇటు అయినా అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలకు చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి 17న ప్రధాని నరేంద్ర మోడీ రాక ?
March 09, 2024
0
Tags