ఉజ్వల గ్యాస్ పథకం లబ్దిదారులందరికీ ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.50 చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం భజన్లాల్ శర్మ ప్రకటించారు. ఈ తగ్గింపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ₹500కు సరఫరా చేస్తుండగా.. జనవరి 1 నుంచి రూ.450కే పంపిణీ చేయనున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం భజన్లాల్ శర్మ ట్వీట్ చేశారు. ''మోడీజీ హామీ అంటే నెరవేర్చే హామీ. ఆయన చెప్పినట్లే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే సూత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని సుపరిపాలనకు పునరంకితమైన రాజస్థాన్ ప్రభుత్వం ప్రజలకు రూ.450కే గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది. భాజపా సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రాజస్థాన్ మహిళా శక్తిని గౌరవించడంతో పాటు వారికి సాధికారత కల్పించాలని నిశ్చయంతో పనిచేస్తుంది'' అని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలన్నింటికీ ఉజ్వల పథకం కింద ₹500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ఏప్రిల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లు చొప్పున గహ్లోత్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 76 లక్షల కుటుంబాలు లబ్దిపొందుతున్నాయి.
వంట గ్యాస్ సిలిండర్పై రూ.50 తగ్గించిన రాజస్థాన్ ప్రభుత్వం
December 27, 2023
0
Tags