మార్ఫింగ్‌ వీడియోల సమస్య పరిష్కారానికి సామాజిక మాధ్యమాలదే బాధ్యత !

Telugu Lo Computer
0


సినీ నటి రష్మిక మందన్నాకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్‌ చేసినట్టు కనిపిస్తుంది. ఈ డీప్‌ఫేక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాకుండా బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాజాగా ఈ డీప్‌ ఫేక్‌ వీడియోపై కేంద్ర ఐటీ విభాగం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాలదే బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఓ ట్వీట్‌ చేశారు. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అని అన్నారు. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల కట్టడికి, సమస్య పరిష్కారానికి సామాజిక మాధ్యమాలదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్‌ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 2023లో నోటిఫై చేసిన ఐటీ నిబంధనలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. 'అన్ని సామాజిక మాధ్యమ వేదికలు కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుంది. 2023 ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధనల ప్రకారం.. సామాజిక మాధ్యమ సంస్థలు ఏ యూజర్‌ కూడా నకిలీ, తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా చూసుకోవాలి. ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే ఆయా సామాజిక మాధ్యమాలు 36 గంటల్లోగా తొలగించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్‌ 7 కింద.. సదరు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ని కోర్టుకు లాగొచ్చు' అని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)