భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కెనడియన్లకు వీసా సేవల్ని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. వీసా సర్వీసుల్ని పునరుద్ధరించడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కెనడా ఓ కండీషన్ను అంగీకరించాల్సి ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. వియన్నా కన్వెన్షన్ ప్రకారం కెనడాలోని భారత దౌత్యవేత్తలకు అక్కడి ప్రభుత్వం భద్రత కల్పిస్తే, వీసా సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. వీసాల జారీ కోసం భారత దౌత్యవేత్తలు కార్యాలయాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుందని, అయితే దౌత్య వివాదం కారణంగా వాళ్లకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే కొన్ని వారాల క్రితం వీసా సర్వీసుల్ని భారత్ నిలిపివేసిందని ఆయన తెలిపారు. ''దౌత్యవేత్తల రక్షణ, భద్రతను నిర్ధారించడం.. వియన్నా కన్వెన్షన్ అత్యంత ప్రాథమిక అంశం. ప్రస్తుత దౌత్య వివాద పరిస్థితుల్లో కెనడాలో ఉంటున్న భారత ప్రజలు, దౌత్యవేత్తలు సురక్షితంగా లేరు. ఇందుకు సాక్ష్యంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవేళ దౌత్యవేత్తలకు భద్రత కల్పిస్తే, అక్కడి పరిస్థితులు పురోగతి చెందితే.. వీసాల సమస్యను సమస్యను పునఃప్రారంభించాలని నేను కోరుకుంటున్నా. ఇది చాలా త్వరగా జరగాలని ఆశిస్తున్నా'' అని జైశంకర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్లిష్టంగా ఉన్నాయని అన్నారు. అయితే.. కెనడా రాజకీయాల్లోని ఒక నిర్దిష్ట విభాగం, దాని విధానాల వల్ల తమకు సమస్య ఉందని వివరించారు. ఇక్కడ పరోక్షంగా ఆయన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి చురకలంటించారని మనం అర్థం చేసుకోవచ్చు.
వీసా సేవల పునరుద్ధరణపై కెనడాకు షరతు పెట్టిన భారత్ !
October 22, 2023
0
Tags