తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన విషయంపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.దొర గారి కమీషన్ల కక్కుర్తికి పంప్ హౌజ్ లే కాకుండా ఏకంగా బరాజ్ లే కుంగుతున్నాయంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రాజెక్ట్ కట్టిన నాలుగేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కదిలిందంటే మీ మెగా లోపమేంటో, మెగా దోపిడేంటో మరోసారి తేటతెల్లమైందంటూ షర్మిల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాసిరకం అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం మరొకటి లేదని అన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కాజేశారనడానికి మేడిగడ్డ కుంగడమే ఒక నిదర్శనమంటూ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ అవినీతికి దర్పాలే కాళేశ్వరం లోపాలని షర్మిల చెప్పారు. 'తప్పులు కప్పి పుచ్చడానికి కుట్ర కోణం అని డ్రామాలు మొదలు పెట్టినా, ప్రాజెక్ట్ చుట్టూ పోలీసులను పెట్టి నిజాలు దాచిపెట్టినా, జరిగిన నష్టాన్ని బయటకు పొక్కకుండా నోర్లు మూయించినా, మీ మానస పుత్రిక కాళేశ్వరం అంతా బోగస్ అని ఆధారాలతో తెలంగాణ సమాజానికి అర్థమైంది' అంటూ ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం నీళ్లు గోదారి పాలని, నిధులు కల్వకుంట్ల వారి పాలని షర్మిల అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటననూ అస్త్రంగా చేరుకుని బీఆర్ఎస్ సర్కారుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల జల్లు గుప్పిస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై షర్మిల ఆగ్రహం !
October 22, 2023
0
Tags